ఏపీని గ్లోబల్ హబ్‌గా మార్చే దిశగా సీఎం చంద్ర‌బాబు.. గూగుల్, ఎన్‌యూఎస్‌తో కీలక భేటీలు

  • గూగుల్ క్లౌడ్, సింగపూర్ వర్సిటీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ
  • ఏపీని ఏఐ, డేటా హబ్‌గా మార్చేందుకు గూగుల్ తో కీలక చర్చలు
  • నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం
  • అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఎన్‌యూఎస్‌కు ప్రతిపాదన
  • రాష్ట్ర అభివృద్ధికి సాంకేతిక, విద్యా రంగాల్లో భాగస్వామ్యంపై దృష్టి
సింగ‌పూర్ ప‌ర్య‌ట‌నలో ఉన్న సీఎం చంద్ర‌బాబు నాయుడు వివిధ సంస్థ‌ల‌తో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తూ బిజీగా ఉన్నారు. ఏపీని టెక్నాలజీ, విద్యారంగాల్లో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆయన కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గూగుల్ క్లౌడ్, సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయం (ఎన్‌యూఎస్) ఉన్నత స్థాయి ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.

ఏపీలో ఏఐ, డిజిటల్ విప్లవం... గూగుల్‌తో భాగస్వామ్యం
ముందుగా గూగుల్ క్లౌడ్ ఆసియా-పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సెంటర్, డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా అభివృద్ధి చేసే అంశంపై ఇరువురు ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్‌ రంగాల్లో గూగుల్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు వీలుగా ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ఏఐ టెక్నాలజీని వినియోగించుకోవడంలో సహకరించాలని చంద్రబాబు గూగుల్ క్లౌడ్‌ను కోరారు. గతంలో తాను ప్రవేశపెట్టిన రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్‌టీజీఎస్) వ్యవస్థను ఆధునిక క్లౌడ్ టెక్నాలజీలతో మరింత శక్తివంతం చేయడంపై చర్చించారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీలలో భారీ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రతిపాదించారు. విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలల్లో గూగుల్ సహకారంతో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో సాధించిన విజయాలను వివరిస్తూ, ప్రభుత్వం నిర్వహిస్తున్న 'సంజీవని' ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని గూగుల్‌ను ఆహ్వానించారు.

అమరావతిలో సింగపూర్ వర్సిటీ... విద్యారంగంలో ముందడుగు
అనంతరం, సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయం (ఎన్‌యూఎస్) ప్రెసిడెంట్ టాన్ ఎంగ్ చేయ్‌తో, ఆయన బృందంతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతిని ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా అమరావతిలో ఎన్‌యూఎస్ అంతర్జాతీయ బ్రాంచ్ లేదా శాటిలైట్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు రాజధాని ప్రాంతంలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయని గుర్తుచేశారు.

అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీలో ప్రపంచ స్థాయి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సాంకేతిక, పరిశోధన సహకారాన్ని అందించాలని ఎన్‌యూఎస్‌ను కోరారు. అలాగే, గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేలా సరికొత్త విధానాల రూపకల్పనలో ఎన్‌యూఎస్‌కు చెందిన పాలసీ ఇనిస్టిట్యూట్ సహకారం తీసుకోవాలని ఆసక్తి కనబరిచారు. ఈ సందర్భంగా ఎన్‌యూఎస్ ప్రతినిధులు అమరావతి నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో తమ భాగస్వామ్యాన్ని పలువురు ప్రొఫెసర్లు గుర్తు చేసుకున్నారు. అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి ప్రతిపాదనపై తమ బోర్డులో చర్చిస్తామని ఎన్‌యూఎస్ ప్రెసిడెంట్ టాన్ ఎంగ్ చేయ్ హామీ ఇచ్చారు. ఈ సమావేశాలతో ఏపీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Chandrababu Naidu
Google Cloud
Singapore Visit
Andhra Pradesh AI Hub
National University of Singapore
Amaravati Development

More Telugu News